Ugadi : తెలంగాణ‌లో నిత్య వ‌సంతం.. ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌, సీఎం

ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ లు శుభాకాంక్ష‌లు తెలిపారు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 22 March 2023 10:05 AM IST

CM KCR, Governor Tamilisai, Ugadi,

గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌

తెలుగు ప్ర‌జ‌లు ఉగాదిని కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంగా భావిస్తారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్‌, తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సీఎం కేసీఆర్ అన్నారు.

ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని నింపాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని ఆశాభావం గ‌వ‌ర్న‌ర్ వ్య‌క్తం చేశారు.

Next Story