'ఉద్ధవ్ థాకరే' ప్రమాణ స్వీకార వేదికపై ముంబయి హైకోర్టు ఆందోళన.!
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Nov 2019 12:03 PM GMTమహాప్రతిష్ఠంభన తర్వాత మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదార్లోని శివాజీ పార్కులో గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే చే గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించనున్నారు. ఈ నేఫథ్యంలో ఈ కార్యక్రమ వేదిక భద్రతపై ముంబయి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
శివాజీ పార్కు లాంటి పబ్లిక్ మైదానంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహంచడం మంచిది కాదని పేర్కొంది. తరచూ ఇలాంటి కార్యక్రమాలు ఈ మైదానంలో జరగడం వల్ల అందరూ ఇలాంటి కార్యక్రమాల కోసం ఈ మైదానాన్ని ఉపయోగించుకుంటారని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఈ ప్రాంతాన్ని హైకోర్టు ‘సైలెన్స్ జోన్’గా ప్రకటించడం గమనార్హం.
వేకోమ్ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ.. క్రీడా మైదానంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నిరోధించాలంటూ బోంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రేపటి కార్యక్రమంపై మేం ఏమీ మాట్లాడదల్చుకోలేదు. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని మాత్రం ప్రార్థిస్తున్నామని పేర్కొంది.