ఒకే రోజు రెండు ఘోర రైలు ప్రమాదాలు..
By Newsmeter.Network
ఉత్తర భారతంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్లో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనగా.. పంజాబ్ లో ట్రాక్ దాటుతున్న కొందరిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
మధ్యప్రదేశలో..
మధ్యప్రదేశలో ఆదివారం తెల్లవారు జామున రెండు కార్గో రైళ్లు ఎదురెదుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఢీ కొన్నవి ప్యాసింజర్లు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్లోని సింగ్రోలిలో బొగ్గును తీసుకువెళుతున్న కార్గో రైలు ఎదురుగా వస్తున్న మరో కార్గో రైలును ఢీ కొట్టింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మరొకరు ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఎన్టిపిసి అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఎన్టిపిసి ప్లాంట్కు బొగ్గు తీసుకెళ్లడానికి ఒకే రైలు మార్గం అనుమతించబడుతుంది. ఒక రైలు మాత్రమే వెళ్లే వీలుంది. ఆదివారం రెండు రైళ్లను ఒకే ట్రాక్లో తరలించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ రైలు బొగ్గు లోడ్తో వెలుతుండగా.. మరొ రైలు ఖాళీగా ఉంది. రైలు ఢీ కొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. బొగ్గు మొత్తం కింద పడింది.
ట్రాక్ దాటుతుండగా..
పంజాబ్ లోని లూథియానాలో గ్యాస్ పురా ప్రాంతంలో ట్రాక్ దాటుతున్నవారిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన రైలు ఢిల్లీ నుంచి అమృత్ సర్ వెళ్తోందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో గ్యాస్ పురా ప్రాంతంలో రైలు గేటు పడినా కూడా కొందరు ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారని, వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొందని చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.