తెలంగాణలో అన్లాక్ 5.0 మార్గదర్శకాలు: ఆ ప్రాంతాల్లో 30 వరకు లాక్డౌన్ కఠినం..!
By సుభాష్ Published on 8 Oct 2020 9:43 AM GMTదేశంలో అన్లాక్ 5.0 ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అన్లాక్5.0 మార్గదర్శకాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు పునః ప్రారంభంపై క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడంతో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెకస్ఉలను 50శాతం సీటింగ్తో తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తూ కేంద్రం హోంశాఖ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఈ ఉత్తర్వులు అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం మార్గదర్శకాలను ప్రకటించారు.
తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం అన్లాక్5.0 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాసంస్థలు ఈనెల 31 వరకు ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో జారీ చేసింది. రాష్ట్రంలో పలు పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, పార్కులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల పునఃప్రారంభంపై కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎగ్జిబిషన్లు కూడా ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మంది గ్రూపులతో కూడిన కార్యక్రమాలకు అనుమతిచ్చింది. అయితే భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగ్గా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక వివాహాలు, అంత్యక్రియల వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరు కాకూడదని తెలిపింది. అంతకు మించి హాజరైతే జిల్లా కలెక్టర్, స్థానిక పోలీసులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది. అలాగే పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలున్నవారు ఎవరైనా సరై తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ బయటకు రాకుండా ఉండాలని సూచించింది.
ఇక విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పాఠశాలలు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే తేదీలను ప్రకటిస్తూ ప్రత్యేకు ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభించడం సాధ్యం కాదని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. దసరా పండగ తర్వాత పరిస్థితులను బట్టి విద్యాసంస్థల ప్రారంభం నిర్ణయం తీసుకుంటామని మంత్రలు సబ్ కమిటీ తెలిపింది. దసరా, దీపావళి పండగల అనంతరం పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రులు వెల్లడించారు.