కేటీఆర్‌కు సత్కార స్వాగతాలు.. మరీ హారీశ్‌ రావు ఏం చేశాడు..?

By Newsmeter.Network  Published on  7 Jan 2020 4:14 AM GMT
కేటీఆర్‌కు సత్కార స్వాగతాలు.. మరీ హారీశ్‌ రావు ఏం చేశాడు..?

ముఖ్యాంశాలు

  • కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • మంత్రి హారీశ్‌రావును పట్టించుకొని టీటీడీ అధికారులు
  • టీటీడీ అధికారులపై అసంతృప్తి, అసహనం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హారీశ్‌రావుకు సరైన ఆహ్వనం లభించలేదు. దీంతో హారీశ్‌రావు టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి కేటీఆర్‌ తిరుమల చేరుకున్నప్పటి నుంచి బ్రహ్మరథం పట్టారు. ఎంపీ మిథున్‌ రెడ్డి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్‌కు ఎంపీ శాలువాతో సత్కరించి శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. కేటీఆర్‌ కొరకు ఎమ్మెల్యే, తూడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అయితే మంత్రి హారీశ్‌రావు విషయంలో మాత్రం టీటీడీ అధికారులు సరిగా స్పందించలేదని సమాచారం. ఈ విషయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారుల పనితీరు సరిగ్గా లేదని తెలుస్తోంది. ప్రొటోకాల్‌ కింద 13 టికెట్లు కోరిన హారీశ్‌రావు.. తిరుమల అధికారులు కేవలం ఆరు మాత్రమే ఇచ్చారు. హరీశ్‌రావుకు తిరుమల అధికారులు కనీసం స్వాగత ఏర్పాట్లు కూడా చేయకపోవడం, సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఓ తెలుగు దినపత్రిక మంత్రి హరీశ్‌రావును వివరణ కోరగా.. తనకు ఎటువంటి అవమానం జరగలేదని చెప్పినట్లు సమాచారం.

కాగా తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని తెలంగాణకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హారీశ్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కడియం శ్రీహరి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే వీరితోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు వేకువజాము నుంచే వీఐపీ ప్రోటాకల్‌ దర్శనం ప్రారంభమైంది. అనంతరం 3.45 గంటల నుంచి సర్వదర్శనం కోసం భక్తులకు అనుమతించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు. శ్రీవారిన మంత్రి కేటీఆర్‌ పుష్కరిణి వైపు నుంచి దర్శించుకున్నారు. అయితే ఆ మార్గం గుండా కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇస్తారు. ఇప్పుడు కేటీఆర్‌ ఆ మార్గం గుండా శ్రీవారి దర్శించుకోవడంపై సృష్టత రావాల్సి ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అధికారులు 4,600 వీఐపీ టికెట్లు బ్రేక్‌ చేయించారు. వీఐపీలని వైకుంఠ క్యూకాంప్లెక్స్‌ ద్వారా దర్శనానికి అనుమతి ఇచ్చారు.

Next Story