రూ.2.5కోట్ల భూమి.. 25లక్షలకెలా కేటాయిస్తారు..?
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2020 8:30 PM IST
స్టూడియో నిర్మాణం కోసం సినీ దర్శకుడు శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5 కోట్లు విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని ప్రశ్నకు సమాధానంగా అడ్వొకేట్ జనరల్ చెప్పారు. దీనిపై న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలు చేశారని.. వారందరికీ ఇలాగే భూములిస్తారా..? అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటికే హైదరాబాదులో అద్భుతమైన రామోజీ ఫిలింసిటీ ఉందని గుర్తు చేసింది. కావాలనుకుంటే ప్రభుత్వమే స్టూడియోను నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ఇలాంటి భూకేటాయింపుల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలకు సహేతుకత ఉండాలని సూచించింది. రామోజీ ఫిలిం సిటి ఉండగా.. మరో పిల్మ్సిటీ అవసరమా..? అని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలుకు ప్రభుత్వం గడువు కోరగా.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.