24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 41 కేసులు.. నలుగురు మృతి

By సుభాష్  Published on  24 May 2020 5:03 PM GMT
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 41 కేసులు.. నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గినా.. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 41 కేసులు న‌మోదయ్యాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1854 కరోనా కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 1092 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 709 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 23 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే న‌మోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 1, వలస కార్మికులు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకింది. తాజాగా ఈ రోజు 24 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గతంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇతర జిల్లాల్లో ఏలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్‌ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story