కేబినెట్‌ టైమ్‌: ఆదాయ మార్గాలపైనే చర్చ

By అంజి  Published on  16 Feb 2020 3:41 PM GMT
కేబినెట్‌ టైమ్‌: ఆదాయ మార్గాలపైనే చర్చ

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మంత్రులతో చర్చించి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 5 గంటల పాటు తెలంగాణ కేబినెట్‌ భేటీ కొనసాగింది. నిధుల సమీకరణపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్ర ఖజానాకు ఆదాయ మార్గాలపై కేబినెట్‌ ప్రత్యేక చర్చ జరిగింది. భూముల మార్కెట్‌ విలువ పెంపుపై ప్రధానంగా చర్చ జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల అమ్మకాలకు కేబినెట్‌ లైన్‌ క్లియర్‌ చేసింది. భూములు అమ్మి రూ. 10 వేల కోట్లు సేకరించాలని నిర్ణయం తీసుకుంది.

ఉప్పల్‌ బగాయత్‌ తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌కు వెంచర్లు, మోకిళ్ల, ప్రతాప సింగారం, మేడ్చల్‌ జిల్లా కొర్రెములలో వెంచర్లు అమ్మి నిధులు సేకరించనున్నట్లు తెలుస్తోంది. భూముల అమ్మకం ద్వారా ఆదాయ రాబడికి ప్రభుత్వం కసరత్తు చేయనుంది. కాగా ఈ నెల 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే చాన్స్‌లు ఉన్నాయి. రెవెన్యూ చట్ట సవరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.

Next Story