చుద్దాం.. దానికి భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్‌

By అంజి  Published on  7 April 2020 5:02 AM GMT
చుద్దాం.. దానికి భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్‌

హైదరాబాద్‌: 'అలా చేస్తే భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌' అన్నారని ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఈ కథనం ప్రకారం.. కరోనా బాధితులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ను అమెరికాకు సరఫరా చేయాలన్న విజ్ఞప్తిని భారత్‌ పట్టించుకోకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుందని ట్రంప్‌ అన్నారు. సోమవారం నాడు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు

డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సమావేశం మాట్లాడారు. భారత్‌ ఎప్పుడూ మంచి పద్దతిలోనే అమెరికాతో వ్యవహరిస్తోందని ట్రంప్‌ వ్యాఖ్యనించారు. 'ఒక వేళ టాబ్లెట్స్‌ను సరఫరా చేయొద్దన్నదే మాదీ నిర్ణయమైతే.. అది తనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఆదివారం ఆ దేశ ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోర్వోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కూడా కోరాను. టాబ్లెట్స్‌ ఎగుమతిపై భారత్‌ నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం.. దానికి ప్రతీకారం ఉండొచ్చు' అంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

మెడిసన్‌ రంగంలో అమెరికాకు భారత్‌ చాలా కాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోంది. అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారి అలైస్‌ జీ వెల్స్‌ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలానే చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు ఇతర ఔషధాలను ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. ఇప్పటికే 29 మిలియన్‌ డోసుల హైడ్సాక్లీక్లోరోక్విన్‌ను నిల్వపెట్టుకున్నామని అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వెల్లడించారు.

అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్‌ రోజు రోజుకు విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 3,67,461 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 10,910 మంది మృత్యువాత పడ్డారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాలను ఎత్తి వేయాలని భారత్‌కు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో కరోనా కట్టడికి భారీ స్థాయిలో ఔషధ నిల్వల ఉండాలి. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కోసం ఎదురుచూస్తున్న అమెరికాపై భారత్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

భారత్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ తోనే కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నారని తెలుసుకున్న ట్రంప్.. ఆదివారం ప్రధాని మోడీకి ఫోన్ చేసి..తమ దేశ పౌరుల కోసం ఆ మందును ఎగుమతి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Next Story