జేసీకి మరో షాకిచ్చిన జగన్‌

By Newsmeter.Network  Published on  31 Jan 2020 2:26 PM GMT
జేసీకి మరో షాకిచ్చిన జగన్‌

జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆంక్షల కొరడా ఝళిపించిన ప్రభుత్వం తాజాగా జేసీ కి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజును రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతంలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులోని సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్‌ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఆగస్ట్ 1న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ కంపెనీకి సిమెంట్ రాయి నిక్షేపాలు తవ్వడానికి ప్రభుత్వం 649.684 హెక్టార్లు లీజుకు ఇచ్చింది. ఆ లీజు గడువు 2027 జూలై 31తో ముగుస్తుంది. అంటే సుమారు 20 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. రెండు సంవత్సరాల్లోపు అక్కడ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిబంధన విధించారు. ఇచ్చిన గడువు లోను కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించలేదు. అయితే మరో ఐదేళ్లు పొడిగిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఆ ఐదేళ్ల గడువును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story