గుడ్న్యూస్: 5 నిమిషాల ముందు రైలు టికెట్ బుకింగ్, క్యాన్సిల్
By సుభాష్ Published on 10 Oct 2020 2:30 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వే శాఖ. నిర్ధేశించిన స్టేషన్ నుంచి రైలు బయలుదేరే సమయానికి 5 నిమిషాల ముందు టికెట్ను బుక్ చేసుకున్నా సీట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే ఐదు నిమిషాల ముందు కూడా బుక్ చేసుకున్న టికెట్ రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రానుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్టు తయారు చేస్తారు. రెండో చార్టును 30 నుంచి 5నిమిషాల ముందు తయారు చేస్తారు. ఖాళీలను బట్టి ప్యాసింజర్ రిజర్వేష కౌంటర్లు ఆన్లైన్ ద్వారా టికెట్లను జారీ చేస్తారు. ఈనెల 17 నుంచి పట్టాలెక్కే తేజస్ ఎక్స్ప్రెస్తో సహా అన్ని ప్రత్యేక రైళ్లకు ఇది వర్తిస్తుంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోగా, ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ప్రజా రవాణాను పూర్తిగా నడిపేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం భారత రైల్వే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కొత్త నిబంధనలు భారత రైల్వే నడుపుతున్న ప్రతి ప్రత్యేక రైలుకు వర్తించనుంది.