దుబ్బాక తీర్పు అలాంటిదే.. ముందు దానిపై సమీక్షించుకోండి
Vijayashanthi On Dubbaka ByPoll Result. టీఆరెస్ అహంకారపూరిత ధోరణులకు.. కేసీఆర్ దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక
By Medi Samrat Published on 11 Nov 2020 3:41 AM GMT
టీఆరెస్ అహంకారపూరిత ధోరణులకు.. కేసీఆర్ దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి విజయశాంతి అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని అమె అన్నారు.
ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆరెస్ అంటోంది. అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆరెస్ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలని.. దుబ్బాకలో టీఆరెస్కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని.. బీజేపీ, కాంగ్రెస్లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించారని.. ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి.. ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండని హితువు పలికారు.
ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండని.. ఏది ఏమైనా.. దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారని.. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజంలో రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.