Telangana: బిగ్‌బాస్‌ అభిమానులపై ఆర్టీసీ ఎండీ ఆగ్రహం

అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన బిగ్‌బాస్‌ అభిమానులు.. అరుపులు.. పరుగులు తీస్తూ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 7:26 AM GMT
tsrtc, md sajjanar, fire,  bigg boss fans,

Telangana: బిగ్‌బాస్‌ అభిమానులపై ఆర్టీసీ ఎండీ ఆగ్రహం 

ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ను ప్రకటించారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఈ సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. సీజన్‌ ముగింపు నేపథ్యలో స్టూడియో వద్దకు అభిమానులు భారీగా వెళ్లారు. ఆ షోలోని పలువురు కంటెస్టెంట్స్‌ ఫ్యాన్స్‌ రోడ్డుపై నానా హంగామా చేశారు. కృష్ణనగర్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున వచ్చిన బిగ్‌బాస్‌ అభిమానులు.. అరుపులు.. పరుగులు తీస్తూ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. పలు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. బిగ్‌బాస్‌ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్‌ సీజన్-7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్టీసీ బస్సులపై కొందరు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో మొత్తం 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఈ సంఘటన గురించి జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. అధికారుల కంప్టైంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

బిగ్‌బాస్‌ అభిమానులపై ఫైర్‌ అయ్యారు సజ్జనార్. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్తానాలకు ఆర్టీసీ బస్సులు చేరుస్తున్నాయని చెప్పారు. అలాంటి ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లే అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలను టీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు అని అన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ బస్సులు ప్రజల ఆస్తి అనీ.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు.




Next Story