తెలుగు సీరియల్ నటి రోడ్డుప్రమాదంలో దుర్మరణం

తెలుగు సీరియల్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 12 May 2024 4:26 PM IST

actress pavithra jayaram, death, road accident,

తెలుగు సీరియల్ నటి రోడ్డుప్రమాదంలో దుర్మరణం 

తెలుగు సీరియల్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ పరిధిలోని శేరిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోనే ఆమె చనిపోయారు.

కాగా.. మూడ్రోజుల క్రితం సీరియల్ షూటింగ్ కోసం పవిత్రా జయారం బెంగళూరుకు వెళ్లారు. ఇక శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో పాటుగా హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలోనే పవిత్రా జయరాం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. దాంతో.. డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా..ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఇక ఇదే ప్రమాదంలో పవిత్ర కుటుంబ సభ్యులు ఇద్దరు, డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన జయరాం.. కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక తెలుగులో 'త్రినయని', 'నిన్నే పెళ్లాడుతా' సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక పవిత్ర మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. ప్రముఖ టీవీ చానెల్ జీతెలుగు కూడా విచారం వ్యక్తం చేసింది. తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేమనీ.. పవిత్ర జయరాం మరణం జీతెలుగు కుటుంబానికి తీరని లోటు అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది. ఇక పవిత్ర మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ఇదే ప్రమాదంలో గాయపడ్డవారు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story