SBI చైర్మన్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎంపిక

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ నియామకం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 5:00 AM GMT
telangana, challa srinivasulu,  SBI, new chairman ,

SBI చైర్మన్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎంపిక

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ నియామకం అయ్యారు. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఈ అవకాశం దక్కింది. ప్రస్తుత ఎస్‌బీఐ సీనియర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫారసు చేసింది.

కాగా.. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉన్న దినేశ్ కుమార్ ఖరా ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యమైంది. ఎఫ్‌ఎస్‌ఐబీ పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది. ఇందులో శెట్టి కూడా ఉన్నారు. బ్యాంకుల్లో వారివారి పనితీరును పరిశీలించి.. అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకను చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫారసు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఐబీ ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ కమిటీ సమావేశమై ఎఫ్‌ఎస్‌ఐబీ సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఎస్‌బీఐ ఎండీగా జనవరి 2020లో శెట్టి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్‌ అండ్ టెక్నాలజీ వర్టికల్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో శెట్టి బేసిక్ వేతనం రూ.26.3 లక్షలు.. డీఏ కింద మరో రూ.9.7 లక్షలు అందుకున్నారు.

చల్లా శ్రీనివాసులు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడుకి చెందిన వ్యక్తి. అదే గ్రామంలో టెన్త్ వరకు చదువుకున్నారు. గద్వాల్‌లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి బీఏ అగ్రికల్చర్‌లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరీయర్ ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.

Next Story