ప్రపంచంలోనే ఎక్కువ ఆత్మహత్యలున్న దేశం భారత్
దేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2024 9:00 AM IST
ప్రపంచంలోనే ఎక్కువ ఆత్మహత్యలున్న దేశం భారత్
దేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా విడుదలైన నివేదిక ద్వారా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నది మన ఇండియాలోనే అని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల సంఖ్య 2021 కంటే 4.2 శాతం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2018 కంటే 27 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష జనాభాకు ఆత్మత్యల రేటు 12.4 గా నమోదైంది.
దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సంక్షోభంగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఆత్మహత్యల నివారణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా.. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలకు కారణం మానసిక సమస్యలే అంటున్నారు వైద్య నిపుణులు. పని ఒత్తిడి, ఆర్థి అంశాలు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు వంటి సమస్యల కారణంగా మొదలయ్యే ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనం చేస్తున్నదని చెబుతున్నారు. ఒత్తిడి మొదలై ఆందోళన, నిరాశగా మారుతుందని, ఇవి ఆత్మహత్యలకు కారణమవుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి అండ్ బిహేవియరల్ సైన్స్ వైస్ చైర్పర్సన్ రాజీవ్ మెహతా తెలిపారు.యువత మరణాలకు ప్రధాన కారణం ఇదే. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే పేదలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒంటరి తనం కూడా కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు.