ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన మోదీ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సతీమణి బ్రిగెట్టికి పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు ప్రధాని మోదీ.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 7:41 AM GMT
PM Modi, France Tour, Gift Telangana Saree, Brigitte,

 ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఆయన ఫ్రాన్స్‌ టూర్‌ ముగిసింది. పర్యటన ముగింపు సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు. అలాగే మెక్రాన్‌ సతీమణి బ్రిగెట్టికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి కూడా మెక్రాన్‌, ఫ్రాన్స్‌ ప్రధాని పలు బహుమతులను అందజేశారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి ప్రధాని పోచంపల్లి ఇకత్‌ చీరను అందజేశారు. దీంతో.. తెలంగాణ ఖ్యాతి ప్రపంచ దేశాలకు పరిచయం అవుతోంది. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మక్రాన్‌కు అలంకారమైన చందనం పెట్టెలో ఉంచిన పోచంపల్లి సిల్క్‌ ఇకత్‌ చేరను అందజేశారు మోదీ. ఇకత్‌ చీరను తెలంగాణలోని పోచంపల్లిలో తయారు చేశారు. అద్భుతంగా కనిపించే రంగులు, అతికష్టమైన డిజైన్లకు ఇకత్‌ చీరలు ప్రత్యేకం.ఇక ఫ్రాన్స్‌ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌కు కూడా బహుమతులు అందజేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత.. మోదీకి 20వ శతాబ్దంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మాక్రాన్ బహుమతిగా ఇచ్చారు. ప్రెసిడెంట్ మాక్రాన్‌కు పూర్తిగా గంధపు చెక్కతో రూపొందించిన సితార్ యొక్క ప్రత్యేకమైన ప్రతిరూపాన్ని బహుకరించారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకల సందర్భంగా ప్రధాని మోదీని సత్కరించారు.

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఈసారి భారత సాయుధ దళాలు కూడా పాల్గొన్నాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. బాస్టీల్‌ డేలో భారత బృందాలను చూడటం సంతోషంగా ఉందని అన్నారు. ఈసారి చేసిన ఫ్రాన్స్ పర్యటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. అయితే.. బాస్టీల్‌ డే పరేడ్‌లో 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బఃదం ఫ్రెంచ్‌ దళాలతో కలిసి కవాతు చేసింది. ఫ్రాన్స్‌ వాయుసేనతో కలిసి భారత్‌కు చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానలు కూడా ఆకాశంలో రంగులద్దాయి.

Next Story