ఆత్మకూరు ఉప ఎన్నిక : నామినేషన్‌ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

By -  Nellutla Kavitha |  Published on  2 Jun 2022 12:14 PM GMT
ఆత్మకూరు ఉప ఎన్నిక : నామినేషన్‌ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

సీఎం జగన్‌ చేతుల మీదుగా నిన్న బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి, ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్‌కు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషమని, ఈ ఎన్నికలు తనకు కొత్త, అయినా సీరియస్‌గా తీసుకుని పని చేసి, అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు విక్రమ్ రెడ్డి. జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇక మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందని, లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్‌కు ఘనమైన నివాళి ఇస్తామని అన్నారు. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి.

Next Story