Drugs Case: విచారణకు రావాలని నవదీప్‌కు నోటీసులు

టాలీవుడ్‌లో మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. నవదీప్‌కు నోటీసులు జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2023 1:30 PM GMT
Madhapur Drugs Case, Tollywood, Notice, Actor Navdeep,

 Drugs Case: విచారణకు రావాలని నవదీప్‌కు నోటీసులు

టాలీవుడ్‌లో మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సినీ నటుడు నవదీప్‌ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని విచారణకు రావాలంటూ నార్కొటిక్‌ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 23న బషీరాబాగ్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని 41ఏ కింద నోటీసులు జారీ చేశారు నార్కొటిక్‌ అధికారులు.

అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన బెయిల్‌ రద్దవడంతో.. పోలీసులు నవదీప్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కొటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ చాటింగ్‌తో పాటు.. కాల్‌ డేటాను తీసుకొన్నారు.ఈ ఆధారాలను నవదీప్‌ ముందు ఉంచి నార్కొటిక్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

కాగా ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్‌ కన్జ్యూమర్‏గా గుర్తించారు. పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన రాంచందర్‌ను విచారించారు. నవదీప్‌తో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు రాంచందర్‌ అనే వ్యక్తి పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. దాంతో.. నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు

Next Story