ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఎవరంటే..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు.

By Srikanth Gundamalla
Published on : 28 July 2024 7:24 AM IST

Telangana, new governor, president murmu,

 ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఎవరంటే..  

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. దీనికి శనివారం రాత్రి ఆమె ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గురు గవర్నర్లను ఇతర రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించారు. సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్‌ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను ఝార్ఖండ్‌కు. కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్‌.విజయశంకర్‌‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు.

రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ బీజేపీ నేత ఓం ప్రకాశ్‌ మాథుర్‌‌ను సిక్కింకి బదిలీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఛత్తీస్‌గఢ్‌‌ గవర్నర్‌గా రామన్‌ దేకా.. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఇక సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అసోంకు బదిలీ అయ్యారు. ఆయనకు మణిపుర్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్‌ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గులాబ్‌ చంద్‌ కటారియా‌ను నియమించారు. గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కే కైలాస్‌నాథ్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. చండీగఢ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కాగా.. తెలంగాణ నుంచి తమిళిసై రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత.. ఇక్కడ ఇంచార్జ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ కొనసాగారు. ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా ఉంటూనే ..ఇక్కడ అదనపు బాధ్యతలను కొనసాగించారు. ప్రస్తుతం ఆయనను మహారాష్ట్రకు కేంద్రం బదిలీ చేసింది. మరోవైపు రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళిసై గవర్నర్ పదవిని వదులుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీచేసి ఓటమిని చూశారు.

Next Story