ధర్మారెడ్డి ఆత్మహత్య కేసు: మాజీ ఎమ్మెల్యేపై కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన కీసర తహసీల్దారు కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన

By సుభాష్  Published on  10 Nov 2020 6:28 AM GMT
ధర్మారెడ్డి ఆత్మహత్య కేసు: మాజీ ఎమ్మెల్యేపై కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన కీసర తహసీల్దారు కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మాజీ తహసీల్దారు నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ధర్మారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.

97 ఎకరాల భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమోయం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధర్మారెడ్డి సూసైడ్‌పై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ ఒత్తిడి చేశారని ఆరోపించారు. తమ భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించారని మండిపడ్డారు. కుట్రపూరితంగానే తమకు ఈ కేసులో ఇరించారని, తమ వారసత్వ భూమిని కేఎల్‌ఆర్‌ కాజేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. 97 ఎకరాల్లో పలు కంపెనీలను కేఎల్‌ఆర్‌ పేరుతో ఏర్పాటు చేశారని ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ భూ వివాదంపై రాజకీయ నేతల ప్రమోయం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నాగరాజును ఆసరాగా చేసుకుని తమపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.

రికార్డుల్లో తమ భూమిపై సర్వ హక్కు ఉంది

రికార్డుల్లో తమ భూమిపై సర్వహక్కు ఉందని కుటుంబ సభ్యులు అన్నారు. ఇందులో తహసీల్దారు నాగరాజు 24 ఎకరాల భూమిని తమ పేరిట మ్యుటేషన్‌ చేశారని, మిగతా భూమిని కూడా తమకు ఎక్కడ మ్యుటేషన్‌ చేస్తారోనని తమపై కక్షగట్టారని అన్నారు.దీని వెనుక మాజీ ఎమ్మెల్యేతో పాటు మరి కొందరు రాజకీయ నేతల ప్రమోయం ఉందన్నారు.

కాగా, మాజీ తహసీల్దారు నాగరాజు కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి.. వాసవి శివనగర్‌లోని చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నకిలీ పాస్‌ బుక్‌ల వ్యవహారంలో ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, 33 రోజులపాలు జైల్లో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. ధర్మారెడ్డి వయసు 80ఏళ్లు. అలాగే ధర్మారెడ్డితో పాటు అరెస్టు అయిన కుమారుడు శ్రీధర్‌రెడ్డి సైతం బెయిల్‌ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు.

Next Story