దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

Country Wide ByPoll Election Counting. దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. 11 రాష్ట్రాల్లో మంగళవారం

By Medi Samrat  Published on  10 Nov 2020 3:51 AM GMT
దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. 11 రాష్ట్రాల్లో మంగళవారం ఈ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. ఇవాళ​ ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం అయ్యింది. కొవిడ్​-19 నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ ఓట్లను లెక్కించనున్నారు.

మధ్యప్రదేశ్​

మధ్యప్రదేశ్​లోని శివరాజ్​సింగ్ చౌహాన్​ ప్రభుత్వం భవితవ్యంపై ఇవాళే స్పష్టత రానుంది. రాష్ట్రంలోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం తన అధికారం నిలబెట్టుకోవాలంటే 8 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్​​ మాత్రం 27 సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోని 19జిల్లాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 355 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​

యూపీలో మొత్తం 7 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. అయితే యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి మెజారిటీతో ఉన్నా.. మరిన్ని స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్​కు పాల్పడిందని ఆరోపణలు చేశారు మాజీ సీఎం, సమాజ్​వాద్​ పార్టీ నేత అఖిలేష్​ యాదవ్. మరి ఈ రెండు పార్టీలే ప్రధానంగా జరిగిన ఈ ఎన్నికలు ఎవరివైపు మొగ్గుచూపుతాయో చూడాలి.

గుజరాత్

గుజరారాత్​​లోని ఉప ఎన్నికలకు ప్రజల నుంచి భారీగానే స్పందన లభించింది. మొత్తం 8స్థానాలకు పోలింగ్​ జరగ్గా.. 60.75 శాతం ఓటింగ్​ నమోదైంది.

నాగాలాండ్

నాగాలాండ్​లో మొత్తం 2స్థానాలకు పోలింగ్​ నిర్వహించారు. కరోనా దృష్ట్యా రాష్ట్రంలో మూడంచెల భద్రత మధ్య ఆయా స్థానాల్లోని ఓట్లను లెక్కించనున్నారు.

ఒడిశా

ఒడిశాలో 2 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. బాలాసోర్​లోని కలెక్టర్​ కార్యాలయంలో కౌంటింగ్​ జరగనుంది. అధికారులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచనలు చేశారు.

మణిపూర్

మణిపూర్​లో ఖాళీ అయిన మొత్తం 4స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో 91.54 శాతం ఓటింగ్​ నమోదైంది.

ఛత్తీస్​ఘడ్

ఛత్తీస్​ఘడ్​లో ఒక్క స్థానం కోసం భాజపా, కాంగ్రెస్​లు పోటీ పడుతున్నాయి.

తెలంగాణ

తెలంగాణలో దుబ్బాక నియోగవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ స్థానం కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య పోటీ నెలకొంది.

హరియాణా

హరియాణాలో ఒక్క స్థానం కోసం 14మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారి భవితవ్యం నేడు తేలనుంది.

కర్ణాటక

కర్ణాటకలో 2స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.

ఝార్ఖండ్

ఝార్ఖండ్​లో ఒక్క స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్​లు తలపడుతున్నాయి.


Next Story