ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతి
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Sep 2019 7:39 AM GMTహైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు 12 గంటల ఇరవై నిముషాలకు మృతి చెందారు. వేణు మాధవ్ మరణించినట్టు ఆయన సోదరుడు గోపాలకృష్ణ, ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. వేణుమాధవ్ మృత దేహాన్ని మధ్యాహ్నం 2 గంటలకు కాప్రా లోని హోసింగ్ బోర్డు కాలనీ మంగాపురం లోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. సూర్యపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్.. స్వతహాగా మిమిక్రీ కళాకారుడు. మిమిక్రీ కళాకారుడిగా రాణిస్తూనే నటుడిగా ఆరంగ్రేటం చేశారు. తెలుగు సినిమా హాస్యనటులలో తనకంటూ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకున్న వేణుమాధవ్ తక్కువ వయస్సులోనే మరణించడం ఇండస్ట్రీకి.. హాస్యప్రియులకి తీరనిలోటు.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం సినిమాతో వేణుమాధవ్ సినిమా రంగంలో ప్రవేశించారు. తొలిప్రేమ సినిమాలో వేణుమాధవ్ చెప్పిన భారీ డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. హంగామా సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణుమాధవ్ హీరోగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఆయన నిర్మాతగా, కథానాయకుడుగా భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాలు నిర్మించారు. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ సినిమాల్లో రాక ముందు తెలుగుదేశధం పార్టీ ఆఫీస్ లోను పని చేసారు. కోదాడకు చెందిన వేణుమాధవ్ హైదరాబాద్ మౌలాలిలో స్ధిరపడ్డారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.