పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్
By Newsmeter.Network Published on 12 Jan 2020 7:20 AM GMT
ముఖ్యాంశాలు
- సంక్రాంతి నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్తున్న జంటనగర వాసులు
- టోల్ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- టోల్ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ
- నెమ్మదిగా కదులుతున్న ఫాస్టాగ్ లేని వాహనాలు
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో ప్రజలు పట్నం నుంచి పల్లెలకు వెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉదయం నుండే వందలాది వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు భారీ ట్రాఫిక్ జామ్ను నియంత్రిస్తున్నారు. నల్గొండ జిల్లా కొర్లపాడ్ టోల్ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరవాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే రహదారిపై వాహనాలు బారులు తీరాయి. అదనపు సిబ్బందితో వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. పండుగకు పెద్ద ఎత్తున నగరవాసులు తమ సొంతూళ్లకు బయల్దేరారు. వాహనాలు సాఫీగా వెళ్లేందుకు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ లైన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాలు టోల్ప్లాజా వద్ద కిక్కిరిసిపోయాయి.
భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగరంగ వైభవంగా సొంత గ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు వెళ్తున్న ప్రజలకు టోల్గేట్ల వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగం నిమిత్తం వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి.