కరోనా ఎఫెక్ట్.. విజేతకు టాయిలెట్ పేపర్
By తోట వంశీ కుమార్ Published on 31 March 2020 8:35 AM GMTకరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. ఈ వైరస్ ముప్పుతో ఇప్పటికే చాలా టోర్నీలు వాయిదా పడగా.. పలు టోర్నీలను రద్దు చేశారు. కాగా యూఎస్ మూడవ స్థాయి మహిళల గోల్ప్ టోర్నీ మాత్రం జరుగుతోంది.
కరోనా కారణంగా అమెరికాలో టాయిలెట్ పేపర్లకు ఎంత డిమాండ్ ఏర్పడిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న మహిళల గోల్ఫ్ లీగ్లో విజేతకు నగదు పాటు టాయిలెట్ పేపర్ రోల్ ను బహుమతిగా ఇస్తున్నారు. ఒక వైపు కరోనా కలవరపెడుతున్నప్పటికి అరిజోనా క్లబ్లో ఆరంభమైన లీగ్లో ముందస్తు జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గతవారం జరిగిన పోటీల్లో సారా విజేతగా నిలిచింది. ఆమెకు 2,800 యుఎస్ డాలర్లతో పాటు టాయిలెట్ పేపర్ను బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతిపై సారా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'గత వారం జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాను. టాయిలెట్ పేపర్ బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. కోర్టులోని గుంతల్లో సబ్బు నురగను నింపుతున్నారు. దీని వల్ల బంతిని సురక్షితంగా తీసుకుంటున్నాం' అని ఈ సారా తెలిపింది.