అయోధ్యలో నేడు తొలి వేడుక.. లక్షల్లో చేరుకున్న భక్తులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Nov 2019 11:40 AM GMTకార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షల్లో అయోధ్యకు భక్తులు క్యూ కట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అతి పెద్ద వేడుక కార్తీకపౌర్ణమి కావడంతో.. అయోధ్య భక్తులతో కిటకిటలాడుతోంది. దాదాపు 5 లక్షల మంది సరయు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అక్కడికి చేరుకున్నారు. రామ్ కీ పడీ, నయాఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. దర్శనం కూడా సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయోధ్యకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం కోసం హెల్త్ సెంటర్లు, తాగునీటి సదుపాయం అక్కడక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. 18 స్థలాల్లో వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండగా.. 20 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30 మొబైల్ టాయ్లెట్లు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.