తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:30 AM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులను దర్శించుకోవాలని అనుకుంటున్న భక్తులకు అలర్ట్. నిత్యం చాలా మంది భక్తులు తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. దర్శనాలకు ఒక్కోసారి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ క్రమంలోనే త్వరగా దర్శనం పూర్తవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తూ ఉంటుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
అంతేకాదు ఈనెల 27న తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. అలాగే నవనీత సేవ మధ్యామ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు దర్శన టికెట్లు, వసతి గదులు, సేవా కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.