ఆపరేషన్ చేస్తూ 'టిక్టాక్'.. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల నియోజకవర్గంలోనే..
By అంజి Published on 24 Feb 2020 5:00 AM GMTకరీంనగర్: టిక్ టాక్ పిచ్చికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఎక్కడ కొద్దిగా సమయం దొరికిన, ఎదైనా కొత్తగా కనిపించిన టిక్ టాక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని టిక్టాక్లు మనుషుల జీవితాలను నాశనం చేస్తుంటే.. మరికొన్ని టిక్టాక్లు బంధాలను ఒక్కటి చేస్తున్నాయి. అయితే తాజాగా హుజురాబాద్ స్థానిక ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. ఆపరేషన్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పుడి టిక్ టాక్ వీడియో ఘటన హుజురాబాద్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ రోగికి వైద్యులు ఆపరేషన్ చేస్తుండగా.. 'సార్ మేం ప్లేయర్సే.. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు. కానీ.. మా ఆట దడ పుట్టిస్తది' అంటూ తమిళ హీరో విజయ్ బిగిల్ సినిమాలోని డైలాగ్తో టిక్ టాక్ వీడియో ఉంది. ఓ పక్క ఆపరేషన్ చేస్తూ.. ఇంకొ పక్క టిక్ టాక్ చేయడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆ వీడియో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. ఆపరేషన్ చేసే సమయంలో తాము వీడియో, ఫొటోలు తీసి రోగి బంధువకుల చూపిస్తామని అన్నారు. ఈ మాములుగా తీసిన వీడియోను ఎవరో ఎడిట్ చేసి దాన్ని తీసుకెళ్లి టిక్టాక్లో పెట్టారని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నియోజవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు.. మంత్రి ఈటల రాజేందర్ను కోరుతున్నారు.