జర్మనీలోని డ్రెస్డెన్ మ్యూజియంలో భారీ చోరీ
By Newsmeter.Network Published on 26 Nov 2019 2:10 PM IST
జర్మనీ: డ్రెస్డెన్ మ్యూజియంలోని గ్రీన్ వాలెట్ భవనంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.7,800 కోట్లు విలువైన శతాబ్ధాల నాటి బంగారు, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ మేరుకు గ్రిల్డ్ విండోను పగులకొట్టిన ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్లో వెల్లడైంది. తెల్లవారుజామున 5 గంటలకు అలారం మోగిన ఐదు నిమిషాలకే అధికారులు అక్కడికి చేరుకున్నా దోపిడీ దొంగలు అప్పటికే పరారయ్యారు. అయితే దొంగలు ఆ విలువైన వస్తువులతో ఆడి కారులో పరారైనట్టు పోలీసులు గుర్తించారు.
పక్కా ప్రణాళిక..
పక్కా ప్రణాళికతోనే దుండగులు మ్యూజియంలోకి ప్రవేశించి ... విద్యుత్ సరఫరా వైర్ను కట్చేశారు. అనంతరం ఘన చరిత్ర, సంస్కృతి కలిగిన విలువైన ఆభరణాలను దొంగిలించారని మ్యూజియం డైరెక్టర్ డిర్క్ సిండ్రం తెలిపారు. ఈ వినూత్న అమూల్యమైన ఆభరణాలను బహిరంగ మార్కెట్లో విక్రయించడం సాధ్యం కాదని పొరుగున ఉన్న సక్సోనీ స్టేట్ డైరెక్టర్ మ్యూజియమ్స్ మేరి అకర్మన్ చెప్పుకొచ్చారు. కాగా, మ్యూజియంలో విలువైన వస్తువుల చోరీ విలువ రూ 7000 కోట్ల వరకూ ఉంటుందని బిల్డ్ న్యూస్పేపర్ వెల్లడించింది. దుండగులను అదుపులోకి తీసుకుని మ్యూజియం వస్తువులను రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.