మళ్లి మావోల ఘాతుకం.. గుత్తేదారుడిని..
By Newsmeter.Network Published on 26 March 2020 6:59 AM GMTఒకపక్క కరోనా వైరస్ కలవర పెడుతుంటే మరోపక్క మావోయిస్టులు తెబడుతున్నారు. తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలో తమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇటు తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులసైతం రోడ్లపైకి వచ్చి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. బయటకొచ్చిన వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇదే సమయంలో అటు దండకారణ్యంలో మావోలు రెచ్చిపోతున్నారు. తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గడ్లో రెండు రోజుల క్రితం మావోలు హింసాత్మక ఘటనలతో వాతావరణం వేడెక్కింది.
Also Read : పోలీస్ చేయి కొరికి.. రక్తాన్నిమరో పోలీస్ చొక్కాపై ఉమ్మి..
సుక్మా జిల్లాలో 17మంది జవాన్లను మావోలు పొట్టన పెట్టుకున్న నక్సల్స్ తాజాగా బీజాపూర్ జిల్లాలో గుత్తేదారుడిని హతమార్చడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వరుస ఘటనలతో సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారంతో పాటు ఇతర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉలికిపాటు నెలకొంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీస్ సర్కిల్కు దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న దండకారణ్యంలోని ఊసూరు బ్లాక్ పరిధిలోని ఆవుపల్లి సమీపంలో గుత్తేదారు శేరు శేఖర్ను మావోయిస్టులు హత్య చేశారు. అక్కడ రహదారి నిర్మాణ పనులు చేపట్టడంతో హింసకు పాల్పడ్డారా..? లేక మరేదైన కారణం అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read :అలా పడుకుంటే.. ‘కరోనా’ నుంచి ఉపశమనం..!
మావోయిస్టు కదలికలపై పోలీసులు కన్నేశారు. వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చత్తీస్గఢ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆపరేషన్ పహార్ విస్తృతంగా కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారంతో నిఘాను పెంచారు. దండకారణ్యాన్ని జల్లెడ పడుతూనే తనిఖీలనుసైతం ముమ్మరం చేశారు. ఎక్కడ కదలికలు ఉన్నా ఇట్టే తెలుసుకునేలా వ్యవస్థను బలపర్చినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో అభయారణ్యంలో మావోయిస్టుల మందుపాతరలతో ముప్పు పొంచి ఉన్నదనే సంకేతాలు రావడంతో ఆదివాసీలను సైతం పోలీసులు అప్రమత్తం చేసినట్లు తెలిసింది.