బంగాళాఖాతంలో వాయు'గండం'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 9:54 AM GMT
బంగాళాఖాతంలో వాయుగండం

ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఇవాళ ఉదయం వాయుగుండంగా మారింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాలలో మాయాబంధర్(అండమాన్ దీవులు)కు పశ్చిమ వాయువ్య దిశగా 200 km, పారాదీప్(ఒరిస్సా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా, బాంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది.

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' తుఫాను

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' అత్యంత తీవ్రమైన తుఫాను ఉత్తర దిశగా ప్రయాణించి అతితీవ్ర తుఫానుగా బలహీనపడింది. ఇవాళ ఉదయం పశ్చిమ మధ్య అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో వీరవల్(గుజరాత్)కి పశ్చిమ నైఋతి దిశగా 720 km, పోర్బంధర్ (గుజరాత్)కి పశ్చిమ నైఋతి దిశగా 660 km దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీనపడి తుఫానుగా మారి గుజరాత్ తీరంలో డియూ, పోర్బంధర్ ల మధ్య నవంబర్ 7 వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన:

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రాలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. రాయలసీమలో కూడా రాగల రెండు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవారం కేంద్రం తెలిపింది.

Next Story