Telangana: ఎన్నికలకు వైఎస్‌ఆర్‌టీపీ దూరం.. కాంగ్రెస్‌కు మద్దతు

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన చేశారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  3 Nov 2023 7:23 AM GMT
ysrtp, sharmila,  telangana elections, congress,

 Telangana: ఎన్నికలకు వైఎస్‌ఆర్‌టీపీ దూరం.. కాంగ్రెస్‌కు మద్దతు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పిన సీపీఎం వారికి గుడ్‌ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తాము 17 నియోజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఇక వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన చేశారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.

తెలంగాణలో రాజన్న పాలన తేవాలన్న లక్ష్యంతో షర్మిల వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు పాదయాత్ర కూడా చేసింది షర్మిల. కానీ.. కాంగ్రెస్‌ పిలుపుతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంది. దీనిపై ఆ పార్టీ నాయకులు షర్మిలతో చర్చలు కూడా జరిపారు. కానీ.. అది ఎటూ తేలలేదు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. విలీనం ఎటూ తేలకపోవడంతో.. ముందు తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ షర్మిల ప్రకటించింది. కానీ.. తాజా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ పోటీకి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

శుక్రవారం రోజు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైఎస్ షర్మిల మీడియాకు వివరించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టుగా వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్‌ అవకాశాలకు అడ్డు పడకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు షర్మిల. అయితే.. ఒంటరిగా తమ అభ్యర్థులను బరిలోకి దింపి కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని.. సోనియా, రాహుల్‌ గాందీలు తనతో అప్యాయంగా మాట్లాడారని షర్మిల గుర్తు చేసుకున్నారు. షర్మిల ఎన్నికల బరిలో దిగుతుందని అనుకున్న వేళ ఆ పార్టీలో పలువురికి ఇది షాకింగ్‌గా మారింది.

Next Story