పూజ చేసి బ‌య‌ట‌కు రాగానే.. యువ‌తి కిడ్నాప్‌.. తండ్రి ప‌క్క‌న ఉండ‌గానే..!

Young woman kidnapped in Sircilla District.ఆల‌యంలో పూజ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ యువ‌తిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2022 5:31 AM GMT
పూజ చేసి బ‌య‌ట‌కు రాగానే.. యువ‌తి కిడ్నాప్‌.. తండ్రి ప‌క్క‌న ఉండ‌గానే..!

ఆల‌యంలో పూజ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ యువ‌తిని కొంద‌రు దుండ‌గులు కిడ్నాప్ చేశారు. బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకుని ప‌రారు అయ్యారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ‌లం మూడప‌ల్లిలో చోటు చేసుకుంది.

మూడ‌పల్లిలో శాలిని(18) అనే యువ‌తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. తండ్రి చంద్ర‌య్య‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో హ‌నుమాన్ దేవాల‌యానికి వెళ్లి పూజ‌లు చేసింది. అనంత‌రం ఆల‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టికే కారులో న‌లుగురు దుండ‌గులు అక్క‌డి చేరుకుని బ‌య‌ట కాపు కాశారు.

యువ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఓ యువ‌కుడు కిడ్నాప్ చేసేందుకు య‌త్నించాడు. యువ‌తి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. యువ‌తి తండ్రిని కొట్టి ఆమెను బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకుని అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో కొంత‌కాలంగా యువ‌తిని వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. దీంతో అత‌డిని ఫోక్సో కేసులో జైలుకి పంపారు. ఇటీవ‌ల ఆ యువ‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. దీంతో అత‌డిపైనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. యువ‌తి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story