ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత నీరు అందించాం : మంత్రి హ‌రీశ్ రావు

We have provided safe water to every house says Minister Harish Rao.రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి మంచి నీరు అందించిన ఘ‌న‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 9:44 AM GMT
ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత నీరు అందించాం : మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి మంచి నీరు అందించిన ఘ‌న‌త భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) దేన‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప‌ఠాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్ల స్థ‌లాల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు అని అన్నారు. జీవో నంబర్ 58 ద్వారా జిల్లాలో 830 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు.

పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌ట్టాలు పంపిణీ చేసిన జిల్లా, మండ‌ల స్థాయి అధికారుల‌ను అభినందించారు. నేటి నుంచి వీరంతా ఇంటి య‌జ‌మానులు మారార‌ని అన్నారు. ఇక ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 13 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల‌కు ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ను నిండు మ‌న‌స్సుతో ఆశీర్వ‌దించాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో మెద‌క్‌ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఎస్ఎం ఐసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా క‌లెక్ట‌ర్ శ‌ర‌త్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story