తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్లకు మెరూన్‌ కలర్‌ యూనిఫాం

Uniform For Lady Conductor In Telangana. తెలంగాణ ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్‌ అందనుంది. మెరూన్‌ కలర్‌

By Medi Samrat  Published on  23 Feb 2021 6:24 AM GMT
Uniform For Lady Conductor In Telangana.

తెలంగాణ ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్‌ అందనుంది. మెరూన్‌ కలర్‌ యూనిఫామ్స్‌లో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్స్‌ అందించనున్నారు. ఆర్టీసీలో పని చేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్‌ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్ని తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో కండక్టర్కు రెండు ఆప్రాన్‌లకు సరిపడ వస్త్రాన్ని సరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని, నిత్యం ఆప్రాన్‌ ధరించి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

2019లో కేసీఆర్‌ ఇచ్చిన హామీ తర్వాత..

కాగా, 2019లో ఆర్టీసీలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా సాగిన సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అందులో వివిధ అంశాలపై నేరుగా ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఆప్రాన్‌ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంది.

ఎక్కువ మంది మెరూన్‌ రంగు వస్త్రం కావాలని కోరుకోవడంతో దానినే సిఫారసు చేసింది ఆ కమిటీ. అలాగే వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం పట్టింది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్‌లు కుట్టివ్వాలంటే 30 వేల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు.

అయితే జీవితాలకు కూడా డబ్బులు చాలాని పరిస్థితి అంతమే నిధులను కూడా కేటాయించం ఆర్టీసీకి కష్టంగా మారింది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచడంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కరోనా సమస్య ఎదురైంది. గత వారం పది రోజుల్లో ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేయడం జరిగిపోయింది. అయితే సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వస్త్రం మాత్రమే ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

మూడేళ్లకోసారి యూనిఫాం ఇచ్చే సంప్రదాయం..

అయితే ఆర్టీసీలో ప్రతి మూడు సంవత్సరాలకోసారి రెండు జతల చొప్పున ఉద్యోగులకు యూనిఫాం అందించే సంప్రదాయం ఉంది. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటారు. కొంత మంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవడంతో కొన్ని డిపోలకు మధ్య ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. ఇక యూనిఫాం లేకుండా డ్యూటీలకు వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో ఉద్యోగులు సొంత డబ్బులతో యూనిఫాం కొనుగోలు చేసి విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిచ్చే యూనిఫాం మహళలకు మాత్రమే ఇవ్వనుంది ఆర్టీసీ.


Next Story