ఆర్టీసీ బస్సుపై ఆకతాయిల దాడి.. ఎండీ సజ్జనార్ సీరియస్

తెలంగాణలో కొందరు ఆకతాయిలు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు.

By Srikanth Gundamalla  Published on  16 May 2024 8:40 AM GMT
tsrtc, md sajjanar, serious,  attack,

ఆర్టీసీ బస్సుపై ఆకతాయిల దాడి.. ఎండీ సజ్జనార్ సీరియస్

తెలంగాణలో కొందరు ఆకతాయిలు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. హైదరాబాద్‌ నగర శివారులోని రాచలూర్ గేట్‌ వద్ద ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకులు చేసిన దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సంఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన వారిపై ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్‌ శాఖ సహకారంతో నిందితులపై హస్టరీ షీట్స్‌ కూడా తెరుస్తామని ఎక్స్‌ వేదికగా పెట్టిన పోస్టులో ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకుల వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు.

ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఎండీ సజ్జనార్.. రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారని చెప్పారు. ఈ సంఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సజ్జనార్ తెలిపారు. ప్రజలను నిత్యం సురక్షితంగా తమతమ గమ్యస్థానాలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సులు చేరుస్తున్నాయని అన్నారు. అలాంటి బస్సులపై ఆకతాయిలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పనులను టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం సహించదంటూ సీరియస్ అయ్యారు. బస్సుపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయనీ.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ని మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.

పోలీసుల విచారణ తర్వాత బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి అనీ.. వాటిని సంరక్షించుకోవాల్సింది కూడా ప్రజలే అన్నారు. ప్రజల ఆస్తులపై దాడి చేయడం శ్రేయస్కరం కాదని చెప్పారు. బస్సు డ్యామేజ్‌ ఖర్చులను కూడా నిందితుల నుంచే వసూలు చేస్తామని ఈ సందర్బంగా ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పేర్కొన్నారు.


Next Story