TSRTC : ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారికి శుభ‌వార్త‌

ఎక్స్‌ప్రెస్ బ‌స్సు స‌ర్వీసుల్లో కిలోమీట‌ర్ ప్రాతిప‌దిక‌న నెల‌వారీ బ‌స్ పాస్‌ల‌ను మంజూరు చేయ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 6:56 AM GMT
TSRTC, Monthly Season Ticket

ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారికి శుభ‌వార్త‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్ బ‌స్సు స‌ర్వీసుల్లో కిలోమీట‌ర్ ప్రాతిప‌దిక‌న నెల‌వారీ బ‌స్ పాస్‌ల‌ను మంజూరు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం శ్లాబ్ విధానం అమ‌ల్లో ఉండ‌గా, దాన్ని ఎత్తేసీ కిలోమీట‌ర్ ఆధారంగా న‌గ‌దు వ‌సూలు చేయ‌నున్నారు. దాంతో పాటే టోల్‌ప్లాజా రుసుమును వ‌సూలు చేస్తారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు నెలవారీ బస్ పాస్ హోల్డర్లకు టోల్ ప్లాజా రుసుము ప్రత్యేకంగా వసూలు చేయబడుతుంది. ప్రయాణికులు ప్రతిరోజూ బస్‌పాస్‌ చూపించి టోల్‌ప్లాజా టికెట్‌ కొనుగోలు చేయాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి టోల్ ఛార్జీతో పాటు నెలవారీ బస్ పాస్ మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలో ప్ర‌తి రోజు 100కి.మీలోపు ప్రయాణించే వారికి ‘మంత్లీ సీజన్ టికెట్’ పేరుతో నెల‌వారీ బ‌స్‌పాసులు మంజూరు చేస్తున్నారు. ప్ర‌స్తుతం 15 వేల వ‌ర‌కు నెల‌వారీ బ‌స్‌పాస్‌లు ఉన్నాయి.

"సాధారణ ఛార్జీలతో పోలిస్తే పాస్ హోల్డర్లకు కార్పొరేషన్ 33 శాతం రాయితీ ఇస్తోంది. ఇది 20 రోజుల ఛార్జ్‌తో 30 రోజుల ప్రయాణాన్ని అందిస్తోంది.“ఇంతకుముందు, ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నెలవారీ బస్ పాస్‌లలో శ్లాబ్ విధానం అమలులో ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సుమారు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. స్లాబ్ విధానంలో 55 కి.మీ వరకు నెలవారీ బస్ పాస్ మంజూరు చేయబడుతుంది. ఇక నుంచి 51 కిలోమీటర్లకు మాత్రమే బస్‌పాస్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది' అని సజ్జనార్ తెలిపారు. అలాగే టోల్ ప్లాజా రుసుము కూడా బస్ పాస్‌లో చేర్చబడుతుంది. ఈ నిర్ణయం నెలవారీ బస్సు ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

Next Story