టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కర్ప్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఉదయం నుండి వెళ్లే బస్సులు మధ్యాహానికి తిరిగి చేరుకునే అవకాశం లేదనందుననే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది తాత్కాలికమేనని చెప్పారు. అయితే.. ఇరు రాష్ట్రాల మధ్య మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రం పూర్తి అనుమతి ఉంటుందన్నారు. అదేవిధంగా.. తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు ప్రకటించారు.
ఏపీలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో.. ఈ మహమ్మారి కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నాం 12 గంటల నుంచి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చిన బస్సులు మధ్నాహాం 12లోపు ఆ రాష్ట్ర సరిహద్దు దాటే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే దాదాపు 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లను కూడా అధికారులు రద్దు చేశారు.