మైనారిటీ డ్రైవర్లకు కార్లు పంపిణీ చేయనున్న టీఎస్ఎంఎఫ్సీ
డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద 20 మంది మైనారిటీ డ్రైవర్లకు 20 స్విఫ్ట్ డిజైర్ కార్లను ఈరోజు మే 16న పంపిణీ చేయనున్నట్లు
By అంజి Published on 16 May 2023 4:15 AM GMTమైనారిటీ డ్రైవర్లకు కార్లు పంపిణీ చేయనున్న టీఎస్ఎంఎఫ్సీ
హైదరాబాద్ : డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద 20 మంది మైనారిటీ డ్రైవర్లకు 20 స్విఫ్ట్ డిజైర్ కార్లను ఈరోజు మే 16న పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ప్రకటించారు. మైనారిటీ డ్రైవర్లు తమ సొంత క్యాబ్ల యజమానులుగా మారేందుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019-2020 సంవత్సరంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం 300 కార్లను మంజూరు చేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అర్హులైన మైనార్టీ డ్రైవర్లకు 280 కార్లను పంపిణీ చేశారు. ఈరోజు 20 మంది డ్రైవర్లకు మరో 20 క్యాబ్లను పంపిణీ చేయనున్నారు, ఇందుకోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కె ఈశ్వర్, హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
రాష్ట్రంలోని మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనివిధంగా విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధి రంగాలతో సహా మైనారిటీల అభివృద్ధికి బృహత్తర చర్యలు చేపట్టారని అన్నారు.. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, త్వరలో శుభవార్త ప్రకటిస్తామన్నారు. మైనారిటీ డ్రైవర్లకు కార్ల పంపిణీతో పాటు, మైనారిటీ వర్గాలను ఆదుకోవడానికి తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేక ఇతర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సమగ్ర అభివృద్ధికి మరియు అభ్యున్నతికి దోహదపడుతోంది.