కరోనా మహమ్మారి అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్నా.. సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవచ్చునని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జులై 30 నుంచి థియేటర్లలో బొమ్మపడనుంది.
ఇదిలా ఉంటే.. థియేటర్ల టిక్కెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు ఈరోజు నేడు విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలంగాణ సర్కార్ ను ఈ సందర్భంగా ప్రశ్నించింది హైకోర్టు. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఆ కమిటీ సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. కమిటీ నివేదిక పై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇచ్చిన గడువులోగా ప్రభుత్వ నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందేనని నొక్కి చెప్పింది. అలాగే.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ , హోం శాఖ సెక్రెటరీ లకు హై కోర్టు ఆదేశాలు చేసింది.