తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

Ts High court dissatisfied Government .. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో

By సుభాష్  Published on  19 Nov 2020 1:55 PM GMT
తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని, కోర్టులో కేసులున్నప్పుడే పరీక్షలు పెంచి తర్వాత తగ్గిస్టున్నట్లు కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసంది. కరోనా కేసుల అంశంలో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. రోజుకు 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఈ పరీక్షలను లక్ష వరకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ ముప్పు పొంచివుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా మార్గదర్శకాలు సరిగ్గా అమలు కావడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు

ఇందుకు స్పందించిన పీహెచ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మార్గదర్శకాలు పాటించేలా హైకోర్టు ప్రజలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ గురించి న్యాయస్థానం ప్రస్తావించింది. అధిక బిల్లులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై ఏమేరకు చర్యలు చేపట్టారో తెలుపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా ఆస్పత్రుల్లోనూ ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్‌ సూచించిన కరోనా పరీక్షలను రాష్ట్రంలో ప్రారంభించాలని ఆదేశించింది. అలాగే కరోనాపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వివరాలు ఎందుకు సమర్పించడం లేదని హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇందుకు సంబంధించి ఈనెల 24లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. కాగా, కరోనా కట్టడి విషయంలో, పరీక్షల విషయంలో ఇప్పటికే ఎన్నో సార్లు హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయ వేసింది. రాష్ట్రంలో కరోనా వివరాలు సరిగ్గా అందించడం లేదని, తప్పుడు సమాచారం అందిస్తోందని, కరోనా కేసులు ఉన్నా.. లేనట్లుగా వివరాలు అందజేస్తోందని ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story