టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. మారయ్య గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీఈటీగా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా నర్సింగ్ భట్. ప్రస్తుతం ఆయన నల్లగొండ పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
సూర్యాపేట జిల్లా తుంగతురి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గాదరి కిషోర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంతాపం తెలిపిన వారిలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ నేత చకిలం అనిల్ కుమార్ లు ఉన్నారు. మారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మారయ్య అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నాం నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.