భారీగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు, ఎంత వచ్చాయంటే..
తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 11:03 AM IST
భారీగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు, ఎంత వచ్చాయంటే..
తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెండింగ్ చలాన్లు పేరుకుపోవడంతో ఈ ఆఫర్ను ప్రకటించింది. డిసెంబర్ 26వ తేదీ నుంచే ఈ రాయితీలు వర్తిస్తున్నాయి. దాంతో.. వాహనదారులు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాహనదారులు పెండింగ్ చలాన్లను పెద్ద ఎత్తున కట్టేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 76 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. అయితే.. రాష్ట్రంలో మొత్తం 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 76.79 లక్షల చలాన్లను క్లియర్ చేసుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా రూ.66.77 కోట్లు వసూలు అయినట్లు అధికారులు చెప్పారు.
పెండింగ్ చలాన్లపై రాయితీలు ప్రకటించినప్పటి వాహనదారులు దీన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారు. ఒక్కోసారి చలాన్లు కట్టే సైట్ కూడా హ్యాంగ్ అవుతోంది. దాంతో.. వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం ఈ చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్తో చెల్లించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. కాగా.. భారీగా మొత్తంలో పెండింగ్ చలాన్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే.. ఈసారి పెండింగ్ చలాన్లు గతంలో కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. దాంతో.. రానున్న రోజుల్లో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనీ.. తద్వారా ఆదాయం భారీగా వస్తుందని భావిస్తున్నారు.