Telangana: నేడు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నాడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By అంజి Published on 19 Aug 2024 8:39 AM IST
Telangana: నేడు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నాడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నిన్న గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికకు అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఆదివారం రాత్రి ఆమోదించింది. కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో సింఘ్వీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేసినట్లు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి.. అభిషేక్ సింఘ్వీని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సింఘ్వీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2014లో విభజన తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తో ఏర్పడిన వివాదాలను ప్రస్తావిస్తూ, సింఘ్వీ ఎన్నిక తెలంగాణ ఆందోళనలు, సమస్యలను పార్లమెంటులోనే కాకుండా కోర్టులలో కూడా హైలైట్ చేయడానికి దోహదపడుతుందని అన్నారు.
సింఘ్వీ రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికిబదోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ తరపున ఆయనను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కాంగ్రెస్ నాయకత్వానికి సీఎల్పీ సమావేశం కృతజ్ఞతలు తెలిపిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు రోజు, సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా నామినేట్ కావడం తనకు గౌరవంగా ఉందని అన్నారు. కె.కేశవరావు కాంగ్రెస్లో చేరేందుకు భారత రాష్ట్ర సమితి నుంచి వైదొలిగిన తర్వాత రావు ఎగువ సభకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ నుంచి నామినేట్ కావడం నా గౌరవం అని సింఘ్వీ విలేకరులతో అన్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్కు మెజారిటీ ఉన్న దృష్ట్యా ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
తెలంగాణలో ఉప ఎన్నికకు సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఆగస్టు 14న కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో సింఘ్వీ ఓడిపోయారు. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఒక్కొక్కరు 34 ఓట్లు సాధించడంతో లాట్ల డ్రా ద్వారా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు.