దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న "దివ్యాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం" వార్తలపై తెలంగాణ ప్రభుత్వం...
By - అంజి |
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న "దివ్యాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం" వార్తలపై తెలంగాణ ప్రభుత్వం మరియు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కీలక వివరణ ఇచ్చాయి. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, అది కేవలం తప్పుడు సమాచారమని స్పష్టం చేశాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల్లో దివ్యాంగులందరికీ పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం కొత్త జీవో (GO) జారీ చేసిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ఇటువంటి వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
నిజం ఏంటి?
దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం కానీ, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కానీ ఎటువంటి కొత్త ఉత్తర్వులు లేదా సర్క్యులర్లను జారీ చేయలేదు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న జీవో కాపీ పూర్తిగా నకిలీది.
ప్రస్తుతం ఉచిత ప్రయాణం ఎవరికి వర్తిస్తుంది?
ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న “మహాలక్ష్మి” పథకం కింద కేవలం తెలంగాణకు చెందిన బాలికలు, అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. వీరు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులకు సంబంధించి పాత నిబంధనలే అమల్లో ఉన్నాయి తప్ప, అందరికీ ఉచితం అనే కొత్త మార్పు ఏదీ జరగలేదు.
నకిలీ జీవోను ఎలా గుర్తించాలి?
వైరల్ అవుతున్న ఆ నకిలీ ఉత్తర్వులో అసంబంధమైన పదజాలం, అధికారిక ఉత్తర్వులకు భిన్నమైన సరళి ఉందని అధికారులు గుర్తించారు. ఇది ప్రభుత్వం లేదా టీజీఎస్ఆర్టీసీ అధికారిక ఛానళ్ల ద్వారా విడుదల కాలేదని స్పష్టం చేశారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించడం, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇటువంటి పోస్టులు పెట్టే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రభుత్వ సూచన:
ఏదైనా కొత్త నిర్ణయం లేదా పథకం అమలులోకి వస్తే, అది అధికారిక ప్రెస్ నోట్లు లేదా టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రకటించబడుతుంది. కాబట్టి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరడమైనది.