యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. జనవరి 17న రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా తమ సత్కారాలను అందుకుంటారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు, తెలంగాణ నుండి మరొకరు ప్రతిష్టాత్మక జాబితాలోకి భాగమయ్యారు. ఇద్దరూ అర్జున అవార్డును అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజీ, తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన దీప్తి జీవన్జీ అవార్డు గ్రహీతలుగా కేంద్రం ప్రకటించింది.
2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను ఖేల్ రత్న కోసం ఎంపిక చేసింది. స్టార్ షూటర్ మను బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేత గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్లకు కేంద్రం ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది.