ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని BRS ఎమ్మెల్యే, కార్పొరేటర్పై ఫిర్యాదు
హైదరాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్పై టీడీపీ ఫిర్యాదు చేసింది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 6:31 AM GMTఎన్నికల కోడ్ ఉల్లంఘించారని BRS ఎమ్మెల్యే, కార్పొరేటర్పై ఫిర్యాదు
తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ పకడ్బందీ నిర్వహించేందుకు సమయాత్తం అవుతున్నారు. అయితే.. హైదరాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్పై ఓ టీడీపీ నేత ఈసీ అదికారులతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహ్మత్నగర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రెహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై ఎన్నికల అధికారులతో పాటు.. బోరబండ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రెహ్మత్నగర్ డివిజన్లోని శివగంగనగర్, చంద్రబోస్ నగర్, ఆరోగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. అయితే.. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సీఎన్రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బిల్డింగ్లు, కరెంటు స్తంభాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు బీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యే మాగంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జూబ్లీహిల్స్ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి నాయుడు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బోరబండ పోలీస్ స్టేషన్లో కూడా టీడీపీ నేత జీవీ నాయుడు కంప్లైంట్ చేశారు. జీవీ నాయుడు ఫిర్యాదు మేరకు మాగంటి గోపీనాథ్ సహా కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.