తెలంగాణలో ఇంటి వద్దకే వచ్చి FIR నమోదు..ఈ నెల 27 నుంచి అమల్లోకి

తెలంగాణలో ఇకపై కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు

By -  Knakam Karthik
Published on : 21 Jan 2026 3:57 PM IST

Telangana Police, CID, Crime Investigation, Crimes against children, Crimes against women

తెలంగాణలో ఇంటి వద్దకే వచ్చి FIR నమోదు..ఈ నెల 27 నుంచి అమల్లోకి

తెలంగాణలో ఇకపై కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు. ఈ విధానం ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తుందని సీఐడీ చీఫ్‌ చారు సిన్హా తెలిపారు. మొత్తం ఏడు రకాల నేరాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ కేసుల్లో బాధితులు ఇంటి నుంచే ఫోన్‌ చేస్తే పోలీసులు ఇంటికే వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. అలాగే, ఎఫ్‌ఐఆర్‌ తర్వాత అవసరమైన స్టేట్‌మెంట్లను కూడా ఇంటి వద్దనే రికార్డు చేస్తారు.

ప్రజల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చారు సిన్హా పేర్కొన్నారు. ముఖ్యంగా రేప్‌, పోక్సో, ర్యాగింగ్‌, భౌతిక దాడుల వంటి సున్నితమైన కేసుల్లో బాధితులకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఈ విధానం అమల్లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిఐడి చీఫ్ తెలిపారు. దీనికోసం పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నామని ఆమె తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛందంగా ఫిర్యాదు చేసేందుకే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని సీఐడీ చీఫ్ వెల్లడించారు.

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మహిళలు మరియు పిల్లలపై నేరాలపై కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ డేటా ప్రకారం, మహిళలపై నేరాలు 2024లో 2,482 కేసుల నుండి 2025లో 2,625 కేసులకు పెరిగాయి - ఇది ఆరు శాతం పెరుగుదల. అదే సమయంలో, పోక్సో చట్టం కింద పిల్లలపై నేరాలు 449 కేసుల నుండి 568 కేసులకు పెరిగాయి, ఇది 27 శాతం గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో, POCSO కేసులు 2024లో 392 నుండి 2025లో 516కి పెరిగాయి. రాచకొండ పరిధిలో మహిళలపై నేరాలు కూడా 2024 నుండి దాదాపు నాలుగు శాతం పెరిగాయి - 2024లో 2,893 కేసుల నుండి 2025లో 3,004 కేసులకు పెరిగాయి.

Next Story