Telangana: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు..!

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చాయి.

By Srikanth Gundamalla
Published on : 5 Jun 2024 7:01 AM IST

telangana, lok sabha results, nota votes ,

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు..!

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌కు 8 లోక్‌సభ స్థానాలు, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. ఇక మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో విజయకేతనం ఎగరేసింది. కానీ..బీఆర్ఎస్ మాత్రం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. దాదాపుగా అన్ని చోట్లలో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. అయితే.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో చాలా మంది ప్రజలు నోటాకే ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే ప్రధాన పార్టీల తర్వాత నోటానే నిలిచింది. పలువురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.

మల్కాజ్‌గిరిలో అత్యధికంగా నోటాకు 13,366 ఓట్లు పోల్‌ అయ్యాయి. మల్కాజ్‌గిరి స్థానంలో మొత్తం 23 మంది పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. సమీప అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మూడు లక్షల ఓట్లు నమోదు అయ్యాయి. ఇక ఈ ముగ్గురి తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు పోల్‌ అయ్యాయి. 20 మంది అభ్యర్థులు నోటా కంటే తక్కువ ఓట్లను నమోదు చేసుకున్నారు.

ఇక మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో డీకే అరుణ విజయం సాధించారు. ఆమెకు 5,10,747 ఓట్లు పడగా.. ఆమె సమీప అభ్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చల్లా వంశీచంద్‌ రెడ్డికి 5,06,247 ఓట్లు పోల్ అయ్యాయి. డీకే అరుణ కేవలం 4500 స్వల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఇక్కడ కూడా నోటాకు 4,330 ఓట్లు రావడం విశేషం. మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఇక ఆదిలాబాద్‌లో మొత్తం 11,762 ఓట్లు నోటాకు పోల్‌ అయ్యాయి. అక్కడ మొత్తం 13 మంది పోటీ చేశారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ తర్వాత నాలుగో స్థానంలో నోటానే ఉంది. ఖమ్మంలో కూడా నోటాకు 6,782 ఓట్లు పడ్డాయి. చేవెళ్లలో 6,423, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు నోటాకు పడ్డాయి. సికింద్రాబాద్‌లో కూడా బీఆర్‌ఎస్ నాలుగో స్థానంలో ఉంటే.. నోటా ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

Next Story