ఉప్పల్‌లో ఓటు వేయడానికి వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి

దేశంలో లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  13 May 2024 9:42 AM GMT
Telangana, lok sabha election, uppal, woman, dead,  polling center,

ఉప్పల్‌లో ఓటు వేయడానికి వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి

దేశంలో లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నా.. పోలింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు అధికారులు. కాగా.. లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది.

ఉప్పల్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. భరత్‌ నగర్‌కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్‌సభ ఎన్నికల వేళ ఓటు వేయడానికి పోలింగ్‌ బూత్‌కి వెళ్లింది. కొంతసేపు ఆ మహిళ క్యూలైన్లో నిలబడింది. ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో లైన్లో నిలబడి ఉన్నప్పుడే కుప్పకూలిపోయింది. దాంతో.. వెంటనే స్పందించిన పోలింగ్‌ సిబ్బంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇక ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఇక దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతురాలి వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో ప్రశాంతంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హైదరాబాద్‌లో 19.37 శాతం, మల్కాజ్‌గిరిలో 27.69 శాతం, సికింద్రాబాద్‌ పరిధిలో 24.91 వాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక మహబూబాబాద్‌లో 48.81 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్‌ నమోదు అవుతుండటంతో.. ఎంఐఎం సభ్యులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఓటు వేయడానికి బయటకు రాని వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఇకనైనా వచ్చి ఓటు వేయండి అంటూ పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story